కరోనా డేంజర్‌ బెల్స్.. సమూహ వ్యాప్తి మొదలైంది, సెప్టెంబర్‌లో పరాకాష్టకు, పరిస్థితి దారుణంగా ఉంది

  • Publish Date - July 19, 2020 / 08:43 AM IST

ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్రజలకు షాకింగ్ న్యూస్ వినిపించింది. అదేంటంటే, కరోనా సమూహ వ్యాప్తి మొదలైంది. ఇక సెప్టెంబర్ లో వైరస్ పరాకాష్టకు చేరనుందని చెప్పి మరింత భయపెట్టింది. ఆ తర్వాత తగ్గు ముఖం పట్టనుందని కాస్త ఊరట ఇచ్చింది ఐఎంఏ.

3రోజుల్లో లక్ష కేసులు నమోదవడానికి కారణం ఇదే:
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ.. సగటున మూడు రోజుల్లో లక్ష చొప్పున నమోదవటం వెనుక ఉన్న కారణాన్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) వెల్లడించింది. ఇప్పటికే మనదేశంలో కరోనా వైరస్‌ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించిందని ప్రకటించింది. ఇంతకాలం పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్న మహమ్మారి.. ఇప్పుడు గ్రామాల్లోకీ ప్రవేశిస్తోందని హెచ్చరించింది.

సెప్టెంబర్‌లో పీక్ స్టేజ్‌కి కరోనా కేసులు:
మరోవైపు, వచ్చే రెండు నెలల్లో కరోనా కేసులు గరిష్ఠస్థాయికి (పీక్‌ స్టేజికి) చేరుకోవచ్చని.. ఆ తర్వాత క్రమంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. అయితే, కేంద్రం మాత్రం.. దేశంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య (యాక్టివ్‌ కేసుల) కన్నా.. కోలుకున్న వారి (రికవరీల) సంఖ్య రెట్టింపునకు చేరుకున్నదని.. ఇదొక సానుకూల పరిణామం అని వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 63 శాతంగా నమోదైందని తెలిపింది.

గ్రామాలకు కూడా కరోనా వ్యాపించింది:
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు దిగజారాయని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ డాక్టర్‌ వీకే మోంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలో కేసులు క్రమంగా పెరుగడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ.. మహమ్మారి గ్రామాలకు కూడా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దుష్పరిణామాలకు ఇది సంకేతం. పరిస్థితులను చూస్తే దేశంలో కరోనా వైరస్‌ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించినట్టు అర్థమవుతోంది’ అని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో వైరస్‌ను కట్టడి చేయడం క్లిష్టమైన ప్రక్రియ అన్నారు.

కరోనా కట్టడికి ఉన్నది ఆ రెండు మార్గాలే:
కరోనా కట్టడికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని మోంగా సూచించారు.
* మొదటిది.. దేశ జనాభాలో 70శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురై సొంతంగా రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించుకుని దాని నుంచి
బయటపడటం (దీనినే సామూహిక రోగ నిరోధక శక్తిని సంతరించుకోవటం అంటారు).
* రెండోది.. మిగిలిన 30శాతం మందిలో టీకా (వ్యాక్సిన్‌) ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం’ అని చెప్పారు.
* వ్యాక్సిన్‌ ద్వారా రోగుల్లో రోగనిరోధక శక్తి పెంచినప్పటికీ, అది మూడు నెలల కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు.

సెప్టెంబర్ తర్వాత తగ్గుముఖం:
దేశంలో వచ్చే సెప్టెంబర్‌ మధ్య నాటికి వైరస్‌ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని (ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతాయని) పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కే శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ నియంత్రణకు రెండో దశ లాక్‌డౌన్‌ వరకు గట్టి చర్యలు అమలైనట్టు తెలిపారు. మే 3 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆంక్షలను క్రమంగా ఎత్తివేయడంతో వైరస్‌ పంజా విసిరిందన్నారు.

ప్రపంచంలో రెండో స్థానంలో భారత్:
దేశంలో కరోనా తీవ్రత మరింత పెరిగింది. గత 3 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయంటే దేశంలో కరోనా ప్రభావం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రోజువారీ కరోనా కేసుల పెరుగుదలలో బ్రెజిల్ ను వెనక్కి నెట్టి, భారత్ రెండో స్థానానికి చేరుకుంది. శనివారం(జూలై 18,2020) నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షల 38వేలగా 716గా ఉంది. 6లక్షల 53వేల 751 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3లక్షల 58వేల 629 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 26వేల 273 మంది కరోనాతో చనిపోయారు. కొన్ని రోజులుగా దేశంలో 30వేలకు పైగా కరోనా కేసులు, భారీ సంఖ్యలో మరణాలు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు