Caste Census: ప్రధాని మోడీకి కాంగ్రెస్ బిగ్ షాక్.. కులగణనలో తీవ్ర లోపాలు.. ఓబీసీల కోసం రంగంలోకి రాహుల్, ఖర్గే
కులగణన ప్రక్రియ(Caste Census)లో వెనుకబడిన తరగతుల వివరాల నమోదుకు ప్రత్యేక విధానం లేకపోవడంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 25, 2026 / 10:53 PM IST
Congress demands changes in caste census questionnaire and obc dropdown
- కులగణన లోపాలపై కాంగ్రెస్ అభ్యంతరం
- ఓబీసీ డ్రాప్డౌన్ జాబితా చేర్చాలి
- సేకరించిన డేటా దెబ్బతినే ప్రమాదం
Caste Census: దేశంలో చేపట్టబోయే కులగణన ప్రక్రియలో వెనుకబడిన తరగతుల (OBC) వివరాల నమోదుకు ప్రత్యేక విధానం లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రశ్నావళి శాస్త్రీయంగా లేదని, ప్రస్తుత ఓపెన్ ఎండెడ్ పద్ధతి వల్ల ఒకే కులం అనేక వేర్వేరు పేర్లతో నమోదై డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కులగణన ప్రశ్నావళిని వెంటనే సవరించి, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి వారు సంయుక్తంగా లేఖ రాశారు.
‘డ్రాప్డౌన్’ జాబితా విధానం అమలు చేయాలి:
ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగానే ఓబీసీల నమోదు కోసం కూడా ‘డ్రాప్డౌన్’ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ నివేదికలు, ఆంత్రోపలాజికల్ సర్వే ఆధారంగా ప్రతి కులానికి కచ్చితమైన వివరాలు సేకరించేలా జాబితాను రూపొందించవచ్చని సూచించారు. గతంలో తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేల్లో ఇదే తరహా పద్ధతిని విజయవంతంగా అమలు చేసినట్లు లేఖలో స్పష్టం చేస్తూ, దానికి సంబంధించిన నమూనా పత్రాలను జతపరిచారు.
కేంద్ర వైఖరిపై జైరాం రమేశ్ విమర్శలు:
మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి కులగణనను(Caste Census) నిజాయితీగా నిర్వహించే ఉద్దేశం లేదని ఆరోపించారు. ప్రస్తుత విధానం ప్రజలను మభ్యపెట్టేలా ఉందని, ఇది కేవలం కాలయాపన చేసే ప్రయత్నమని విమర్శించారు. రాజకీయ పార్టీలు, విషయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నూతన ప్రశ్నావళిని ఖరారు చేయాలని, తద్వారానే వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం, న్యాయం చేకూరుతుందని నాయకులు స్పష్టం చేశారు.
