Congress Leader Rahul Gandhi
Rahul Gandhi – Adani : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పారిశ్రామిక వేత్త అదానిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరెంట్ బిల్లులు పెరగడానికి అదానినే కారణం అంటూ విమర్శించారు. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ లో వచ్చిన అదాని మిస్టీరియస్ కోల్ ప్రైసెస్ కథనం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. అదాని ఇండోనేషియా నుంచి బొగ్గును కొని భారత్ కు తీసుకువచ్చి దాని ధర రెట్టింపు చేస్తున్నారంటూ ఆరోపించారు. బొగ్గు ధర పెరిగిందని కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నుంచి 12వేల కోట్లు దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, మధ్యప్రదేశ్ లో పవర్ బిల్లుపైన సబ్సిడీ ఇస్తుంటే.. అదాని రేట్లు పెంచి దోచుకుంటున్నారంటూ రాహుల్ మండిపడ్డారు.
అదాని ఇప్పటి వరకు 32వేల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదాని వ్యవహారంపై దర్యాప్తు జరుపుతాం. ఎవరు ప్రజా ధనం దోచుకున్నా కాంగ్రెస్ దర్యాప్తు జరుపుతుందని రాహుల్ అన్నారు. భారత ప్రధాని ప్రజల నుంచి డబ్బుని దోచుకుంటున్న అదానిని కాపాడుతున్నారంటూ రాహుల్ ఆరోపించారు. అదానిపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అదాని వ్యవహారంలో సెబీకి పత్రాలు దొరకడం లేదు. కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ కి ఆధారాలు దొరుకుతున్నాయి. దీన్నిబట్టిచూస్తే అదానిని భారత ప్రధాని కాపాడుతున్నారని స్పష్టమవుతుందని రాహుల్ అన్నారు.
మనం ఇంటిలో ఫ్యాన్, బుల్బ్, అన్ని రంగాల నుండి అదాని దోచుకుంటున్నారు. వ్యవసాయం, పోర్టులు, ఎయిర్ పోర్టులు, పవర్ సెక్టార్ ఇలా అన్నిరంగాల్లో అదాని ప్రజలు నుంచి దోచుకుంటున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అన్ని సభలు, సమావేశాలలో అదాని గురించి చెప్తున్నాకూడా ప్రధాని మోడీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని రాహుల్ ప్రశ్నించారు. అదాని సంస్థలు, కంపెనీలపైన మోడీ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.