Congress Party: సోనియా నివాసంలో 6 గంటల పాటు కాంగ్రెస్ నేతల సమావేశం: పాల్గొన్న ప్రశాంత్ కిషోర్
సోనియా గాంధీ నివాసంలో సుమారు 6 గంటలపాటు సాగిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు
- Bharath Reddy
- Updated on- April 21, 2022 / 02:14 PM IST
Congress
Congress Party: ప్రజల విశ్వాసం తిరిగి పొందేవిధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు..అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈక్రమంలో గత పది రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షణలో బుధవారం కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో సుమారు 6 గంటలపాటు సాగిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు, సంస్థాగతంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో చర్చలు, సమాలోచనలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని సూర్జేవాలా వివరించారు.
Also read:Modi: విదేశీయుల కోసం త్వరలో ‘ఆయుష్ వీసా’: మోదీ
అందరి అభిప్రాయాలను తీసుకుని, కాంగ్రెస్ పార్టీ కొత్త రూపు సంతరించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని..2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు, రాష్ట్రాలకు జరిగే ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సమాలోచనలు జరుగుతున్నట్లు సూర్జేవాలా పేర్కొన్నారు. ప్రగతిశీల, శక్తివంతమైన “భారత్” దేశాన్ని ఆవిష్కరించుకునేందుకు అనుసరించాల్సిన విధానాల పై చర్చలు జరుగుతున్నాయని, సోనియా గాంధీ ఏర్పాటు చేసిన “ప్రత్యేక కమిటీ” అన్ని అంశాలు, అందరి అభిప్రాయాలను పరిశీలించనున్నట్లు సూర్జేవాలా వివరించారు.
Also read:Kishan Reddy: వడ్లకు సంచుల్లేవ్.. తండ్రీ కొడుకులు తట్టలో తీసుకొస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
