Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 70మంది మరణించారు. 350మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మృతులు, గాయపడ్డ వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. హౌరా వెళ్తున్న బెంగళూరు-హౌరా రైలు (12864) బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ రైలు బోగీలు మరో ట్రాక్ పైకి వెళ్లాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై వచ్చిన
షాలిమార్ (కోల్ కతా) నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (12841).. పట్టాలు తప్పిన బోగీలను ఢీకొట్టింది. దాంతో ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలు బోగీలు బోల్తా పడ్డాయి. వాటి కింద ప్రయాణికులు చిక్కుకున్నారు. వీరిలో కొందరు చనిపోయారు. వందలాది మంది గాయడపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు మరో రైలు బోగీలను ఢీకొట్టడంతో పాటు ఆగి ఉన్న గూడ్స్ రైలు వ్యాగన్లను కూడా గుద్దుకుందని అధికారులు తెలిపారు.
Also Read..Coromandel Express derails: కోరమాండల్ రైలు ప్రమాద ఘటన.. రైల్వే హెల్ప్లైన్ నెంబర్లు
కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి. మృతదేహాలను, గాయపడ్డ వారిని తరలించేందుకు 50 అంబులెన్స్ లు స్పాట్ కి చేరుకున్నాయి. అయినా అవి సరిపోలేదు. దీంతో అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. మరోవైపు 50మంది డాక్టర్లు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్ తో పాటు వైమానిక దళం సహాయక చర్యలు చేపట్టింది.
కోరమాండల్ ప్రమాదం.. ఏపీలో హెల్ప్ లైన్స్ నెంబర్లు..
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ఏపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
విశాఖలో హెల్ప్ లైన్ నెంబర్లు: 08912746330, 08912744619
విజయనగరం : 08922-221202, 08922-221206
విజయవాడ : 0866 2576924
రాజమహేంద్రవరం : 08832420541
ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేసింది కేంద్రం. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ యాక్సిడెంట్ లో 7 బోగీలు బోల్తా పడ్డాయి. వాటి కింద ప్రయాణికులు చిక్కుకుపోయారు. శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.