Cyclone Yaas Effect : యాస్ తుఫాను ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం, కాసరగోడ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజధానిలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరదల్లో మునిగిపోయాయి. ఒక్క కాసరగోడ్లో 9 సెం.మీ వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తిరువనంతపురంలో 7 సెం.మీ భారీ వర్షం కురిసింది. తంపానూర్ కెఎస్ఆర్టిసి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణాలు వరదనీళ్లతో నిండిపోయాయి.
త్రిస్సూర్, మలప్పురం, వయనాడ్, కన్నూర్, కాసరాగోడ్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ హెచ్చరికను ప్రకటించింది వాతావరణ శాఖ. బుధవారం రోజున కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమొరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలకు చేరుకున్నాయి.
నైరుతి రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉంది. యాస్ తుఫాను ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాటి, తీవ్రమైన తుఫాను మారనుంది. దీని ఫలితంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.