Wayanad Landslides Incident : వయనాడ్ విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 369 చేరింది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన వారిలో 49 మంది చిన్నారులు ఉండటం విషాదకరం. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 6 రోజులుగా వయనాడ్ జిల్లాలో మెప్పాడి, ముండక్కై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, KSDRF, ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, కేరళ పోలీసులు, అటవీ శాఖ, K-9 డాగ్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్, కేరళ ఫైర్ ఫోర్స్ అధికారులు సహాక చర్యలు పాల్గొన్నారు.
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ సర్వే కొనసాగుతోంది. కొట్టుకుపోయిన నిర్మాణాలను గుర్తించడానికి ఘటనా స్థలిలో పాత ఫోటోల ద్వారా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఫోటోగ్రఫీ ఫోల్డర్ లో మిస్సింగ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. 1300 మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కాగా, కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 1208 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ముండక్కైలో 540, చురల్మలలో 600, అత్తమలో 68 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 3వేల 700 ఎకరాల వ్యవసాయ భూమిలో 21.111 కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది.
Also Read : విశాఖ నగరానికి ముంచుకొస్తున్న ముప్పు..! బెంగళూరు సంస్థ అధ్యయనంలో షాకింగ్ అంశాలు