Anil Baijal
Anil Baijal దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు,వేల మంది మరణాలు నమోదవుతున్నాయి. కరోనాబారిన పడుతున్న వాళ్లలో సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనాబారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనిల్ బైజాల్ తెలిపారు. లక్షణాలు బయటిపడినప్పటినుంచే తాను సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని,ఇటీవల తనను కలిసినవాళ్లందరూ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపారు. తన నివాసం నుంచే విధులు నిర్వహిస్తానని, ఢిల్లీలోని పరిస్థితిని మానిటర్ చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.
కాగా, ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ వేలాదిమంది కరోనా బారినపడుతూ ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు, సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకే పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.