Karthika Masam
Karthika Deepam : హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అత్యంత ప్రవిత్రమైన మాసంమని నమ్ముతారు. అది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యా దీపం నమోస్తుతే’. మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. ఈ మాసంలో పూజలు, అరాధనలు చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం ద్వారా జీవితంలో కమ్ముకున్న చీకట్లను పారద్రోలేందుకు ప్రయత్నిస్తారు. కార్తీక మాసం మొత్తం దీపారాధనతో పూజలు నిర్వహిస్తారు.
దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించి కార్తీక పురాణం లేదా భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామావళి వంటి వాటిని పారాయణం చేయాలని పండితులు చెబుతుంటారు. నెలరోజుల పాటు చేపట్టే దీపోత్సవం పుణ్యప్రదంగా భావిస్తారు. ఉదయం తెల్లవారు జామునే స్నానాలు ఆచరించి దీపాలను వెలిగిస్తారు. ఇంటి గుమ్మ ముందు, తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద, దేవాలయాల్లోని ద్వజస్ధంభాల వద్ద దీపారాధన చేయటం వల్ల ఆయురారోగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మట్టి కుందుల్లో నువ్వుల నూనెతో దీపారదన చేస్తే మంచిదని నమ్ముతారు. రాగి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించటం వల్ల సర్వరోగాలు, దోషాలు నశిస్తాయట. స్టీలు కుందుల్లో దీపారధన చేయరాదు. దీపారాధన సమయంలో ప్రమిదల్లో నూనె పోసిన తరువాతనే వత్తులు వేసి వెలిగించాలి. ప్రమిదల్లోని వత్తులను అగ్గిపుల్లతో వెలిగించకుండా ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి కర్పూరంతో వత్తులను వెలిగించుకోవాలి. దీపారధన చేసేందుకు శనగ నూనెను ఎట్టిపరిస్ధితుల్లో వాడరాదు.
ఒక వత్తితో దీపారాధన చేయకూడదు. ఇలా చేస్తే అశుభం కలుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం. అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేథస్సు పెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. కార్తీక మాసంలో ఒక నెల పాటు నిరంతరం తులసి ముందు దీపం వెలిగించడం చాలా మంచి ఫలితాలని ,సర్వోత్కృష్టమైన పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది. కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.