Draupadi Murmu : భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాపై 2 లక్షల 96వేల 626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. పోలైన 4వేల 754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 3వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51శాతం ఓట్లు వచ్చినట్లు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది.
రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమెకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షా ఆమె నివాసానికి వెళ్లి స్వీట్స్ తినిపించారు.
Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం
మూడు రౌండ్లలో అక్షరక్రమంలో ఏపీతో మొదలుపెట్టి పదేసి రాష్ట్రాల ఓట్లను ఒక్కో రౌండ్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరిలను చివర్లో లెక్కించారు. యశ్వంత్సిన్హాకు ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, సిక్కింలలో ఒక్క ఓటు కూడా పడలేదు. ద్రౌపదీ ముర్ముకు అలాంటి పరిస్థితి ఒక్కచోటా ఎదురుకాలేదు. చెల్లని ఓట్ల సంఖ్య 53గా తేల్చారు. ఇందులో 15పార్లమెంట్ సభ్యులవికాగా… 38 ఎమ్మెల్యేలవి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో అత్యధికంగా అయిదేసి ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. తెలంగాణలోనూ ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయ్రంగపూర్లో సంబరాలు మిన్నంటాయి. ఉపర్బెడలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతి భవన్లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.