EC rejects Congress's allegations over irregularities in Haryana elections
Haryana Elections : ఇటీవలే ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తోసిపుచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రాసిన లేఖలో ఎన్నికల సంఘం.. ప్రతి ఎన్నికల తర్వాత మద్దతు లేని వాదనలు చేయడం మానుకోవాలని పిలుపునిచ్చింది. సరైన ఆధారాలు లేకుండా సాధారణ సందేహాలను పార్టీ లేవనెత్తిందని కమిషన్ ఆరోపించింది.
“ఇది ఓ జాతీయ రాజకీయ పార్టీ నుంచి ఇలాంటిది ఊహించలేదు. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బలోపేతం చేయడంలో రాజకీయ పార్టీల పరిశీలనాత్మక అభిప్రాయాల విమర్శలను కమిషన్ అభినందిస్తుంది. సకాలంలో ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తుంది”అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
హర్యానాలో అక్టోబరు 5న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి 3 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించింది ఈసీ. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఫలితాల ప్రకటన తర్వాత కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, జైరాం రమేశ్, అజయ్ మాకెన్, భూపీందర్ సింగ్ హుడాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీ సీనియర్ సభ్యులు ఈసీ అధికారులతో సమావేశమై 20 ఫిర్యాదులతో కూడిన జాబితాను సమర్పించారు.
కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) బ్యాటరీ లెవెల్స్లో తేడాలున్నాయని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు రోజున కొన్ని యంత్రాలు 99 శాతం బ్యాటరీ స్థాయిని ప్రదర్శించగా, మరికొన్ని 60 నుంచి 70 శాతం వరకు ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు ఈ యంత్రాలను సీలు చేసి భద్రపరచాలని పార్టీ డిమాండ్ చేసింది.
Read Also : Gossip Garage : కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ బాట.. విడుదల దారెటు..!