Ekaveerikadevi Shakthi Petham : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు నాందేడ్కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరమున మహూర్గడ్ అనే క్షేత్రం కలదు. మహూర్ బస్స్టాండ్కు దాదాపు 3 కి.మీ. దూరంలో ఎత్తైన పర్వతంమీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. రేణుకాదేవినే శ్రీ ఏకవీరికాదేవిగా కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందింది ఏకవీరాదేవి శక్తిపీఠం. సతీదేవి కుడిస్తనం పడినచోటుగా భక్తులు అమ్మవారిని కొలుచుకుంటారు.
ఆలయమంతా సింధూర రంగులో దర్శనమిచ్చే శ్రీ ఏకవీరికాదేవి మందిరము చాల ప్రాచీనమైనది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. ముందుగా శ్రీ పరశురామ్ గణేష్ దర్శనము చేసుకున్నాక తరువాత రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. చక్కటి అలంకారంతో ఉన్నా కాస్త భయానకంగా కూడా దర్శమిస్తుంటుందీ ఏకవీరాదేవి.మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉంటుంది. మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన చేసుకుని తరిస్తారు.
మహూర్గడ్ క్షేత్రం శ్రీ రేణుకాదేవి మందిరంతో పాటు శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరములు చూడదగినవి. క్షేత్రము నందలి శ్రీ పరశురామమందిరం, శ్రీ సర్వతీర్థ, శ్రీకైలాసగిరి, శ్రీవనదేవి, శ్రీమహాకాళి మందిరము, శ్రీ చింతామణి మందిరం, శ్రీ మాతృతీర్థ, శ్రీగోముఖ, శివతీర్థ, శ్రీపాపహరణికుండ్, శ్రీఅమ్త్కుండ్, శ్రీఆత్మబోదకుండ్, శ్రీజమదగ్నిగుట్ట, పాండవులగుహ, కోఠిభూమి, సంగమేశ్వరం, శ్రీదేవదేవేరిమందిరం, మ్యూజియం మొదలగునవి కూడ చూడాల్సిన క్షేత్రాలు.