Explosion : కేరళలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు.. ఒకరు మృతి
పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
- bheemraj
- Updated on- October 29, 2023 / 12:36 PM IST
Explosion in Kerala
Kerala Explosion – One Killed : కేరళలో పేలుడు కలకలం రేపింది. ఎర్నాకులంలోని ఓ క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఆదివారం కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని కన్వెన్షన్ సెంటర్ లో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్ హాల్ మధ్యలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మరికొద్ది క్షణాల్లోనే మరో రెండు, మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరకున్నారు. సహాయక్య చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. హాల్ లో ఉన్నవారిని బయటకి తీసుకొచ్చారు. అయితే కన్వెన్షన్ సెంటర్ లో లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను బయటికి తీసుకురావడంతో ఆలస్యమైందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అది బాంబు పేలుడా లేదా మరొకటా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
పేలుళ్లకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం : సీఎం పినరయి విజయన్
కాగా, ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరం అన్నారు. పేలుళ్లకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనను తాము చాలా సీరియస్
గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముగ్గురు ఉన్నతాధికారులు ఎర్నాకుళంలోనే ఉన్నారని, డీజీపీ కూడా ఘటనాస్థలానికి వెళ్తున్నారని తెలిపారు.
