Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మహా వికాస్ అంఘాడి (ఎంబీఎం) కూటమి ప్రభుత్వం పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. శిసేన నేత, ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రేకు షాకిచ్చాడు. శివసేన ఎమ్మెల్యేలతో పాటు, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం 46 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో తెగతెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. ఠాక్రే మాత్రం రాజీపడి బీజేపీతో కలిసేకంటే అసెంబ్లీని రద్దుచేయడానికే మొగ్గుచూపుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు క్యాబినెట్ అత్యవసర సమావేశంను నిర్వహించి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తారని సమాచారం.
Maharashtra Political Crisis: రసవత్తరంగా ‘మహా’ రాజకీయం.. అసెంబ్లీ రద్దు యోచనలో ఉద్ధవ్ ఠాక్రే?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి వ్యూహరచన చేసింది మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవటంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ మద్దతుతో ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవటంతో మూడు రోజుల్లోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు కలిసి మహా వికాస్ అంఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మహా వికాస్ అంఘాడీ కూటమికి ఝలక్ ఇచ్చేందుకు గత ఆరు నెలల నుంచి ఫడణవీస్ పావులు కదిపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. తనను మూడు రోజుల సీఎంగా మార్చిన మహా వికాస్ అంఘాడీ కూటమిలో చీలిక తెచ్చేందుకు ఫడవీస్ పక్కాగా వ్యూహరచన చేశారు. చురుకైన రాజకీయ ఎత్తుగడలతోనే ఏక్ నాథ్ షిండేను పావుగా ఉపయోగించి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు సిద్ధమయ్యారు.
Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
ప్రస్తుత సమయంలో సామాజిక కార్యకర్త, ఫడణవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు. అయితే ఆమె దానిని వెంటనే తొలగించారు. తన ఉపసంహరించుకున్న ట్వీట్లో హిందీలో ‘ఏక్ థా కప్తీ రాజా’ (ఒకప్పుడు మోసగాడు రాజు ఉన్నాడు) అని రాశారు. ఆమె తన ట్వీట్లో ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద రాజకీయ ఎదురుదెబ్బకు గురైన సమయంలో ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలి బీజేపీ, రెబల్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటైతే సీఎంగా ఫడణవీస్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.