Farmers Protest : పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో 12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం.. పెరుగుతున్నమరణాలు
మరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.
- Harishth Thanniru
- Published On : February 24, 2024 / 10:14 AM IST
Farmers Protest
Punjab – Haryana Border : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టి ఛలో ఢిల్లీ మరింత ఉధృతమవుతోంది. పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో 12రోజులకు రైతు ఉద్యమం చేరింది. శంభు బార్డర్ లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఫిబ్రవరి 29 వరకు ఢిల్లీ ఛలో ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకు శిబిరాల వద్దనే ఆందోళనలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే, ఇవాళ (శనివారం) క్యాండిల్ మార్చ్, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 21న ఢిల్లీ ఛలో ఆందోళన సందర్భంగా శంభు, ఖనౌరి సరిహద్దుల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. యువరైతు శుభకరన్ సింగ్ మృతిచెందాడు. పంజాబ్ పోలీసులు హర్యానాలో పోలీసులపై కేసు నమోదుచేసే వరకు యువకుడి శవపరీక్ష, దహన సంస్కారాలను అనుమతించబోమని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆందోళన మరింత ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Farmers Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన.. ఏం జరుగుతుందో తెలుసా? ఎటుచూసినా వారే..
మరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కోటి పరిహారం, శుభ్ కరణ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని శుభ్ కరణ్ కుటుంబం తిరస్కరించింది. మాకు డబ్బు కాదు న్యాయం కావాలంటూ శుభ్ కరణ్ కుటుంబ సభ్యులు డిమాడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 29న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు సంఘాలు తెలిపారు. మరోవైపు ఢిల్లీ చలో రైతు ఆందోళనలో రైతుల మరణాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ ఛలో ఆందోళనలో భాగంగా ఇప్పటి వరకు నలుగురు రైతులు మృతి చెందారు. పోలీసుల కాల్పులు, అనారోగ్యంతో పంజాబ్ – హర్యానా సరిహద్దు నిరసన శిబిరరాల్లో రైతులు మృత్యువాత పడుతున్నారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య మంత్రుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతర కృషి చేస్తున్నారని సీతారామన్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అన్ని విధాల చర్యలు చేపడుతున్నాడని సీతారామన్ అన్నారు.
