Farmers To Protest Outside Bjp Lawmakers Homes Tomorrow
Bharatiya Kisan Union నూతన వ్యవసాయ చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శనివారం(జూన్-5,2021) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(BKU)శుక్రవారం తెలిపింది. ఈ చట్టాలను కేంద్రం ఆర్డినెన్స్లుగా ప్రకటించి ఏడాది గడుస్తున్న సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు బీకేయూ తెలిపింది.
కేంద్ర వైఖరిపై నిరసనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలే,ఎంపీల ఇళ్ల ముందు నూతన వ్యవసాయ చట్టాల కాపీలను నిరసనకారులు తగులబెడతారని బీకేయూ మీడియా ఇన్ చార్జ్ ధర్మేంద్ర మాలిక్ తెలిపారు.అయితే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని చోట రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అదేవిధంగా సంబంధిత చట్టాల కాపీలను కాల్చివేయనున్నట్లు మాలిక్ చెప్పారు.
రైతు సంఘాల నాయకుల ఇటీవల సమావేశంలో జూన్ 5 నిరసన కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దులో గతేడాది నవంబర్ నుంచి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఆందోనలకు దిగిన విషయం తెలిసిందే. పలుసార్లు కేంద్రం-రైతులు మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి పలించలేదు. చట్టాలను ఉపసంహరించుకునే ప్రశక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పగా…చట్టాలను రద్దు చేసేంతవరకు ఇళ్లకు వెళ్లే ప్రశ్నే లేదని రైతులు కూడా తేల్చి చెప్పారు.