Bomb Threat To Plane
Bomb Threat To Plane: రష్యా నుంచి గోవా వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. గోవా ఎయిర్పోర్టు డైరెక్టర్కు ఇ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. భారత గగనతలంలోకి ప్రవేశానికి కొద్ది సమయం ముందు బాంబు బెదిరింపు రావటంతో అప్రమత్తమైన విమానయాన శాఖ అధికారులు విమానాన్ని ఉజ్జెకిస్తాన్ విమనాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అజూర్ ఎయిర్ విమానం (AZV2463) 240 మంది ప్రయాణికులతో రష్యా నుంచి బయలుదేరింది. దక్షిణ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో తెల్లవారు జామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, డబోలిమ్ విమానాశ్రయం డైరెక్టర్కు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఇ-మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమై ఉజ్జెకిస్తాన్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు.
వారం రోజుల వ్యవధిలో విమానంలో బాంబు బెదిరింపు రావటం ఇది రెండోది. ఈ నెల 9న బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. అజూర్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన మరో చార్టర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గుజరాత్లోని జామ్నగర్కు మళ్లించారు. ఆ సమయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన విమానంలో 236 మంది ప్రయాణికులు ఉన్నారు.