Godhra case: గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టిన ఘటనలో దోషుల విడుదలకు గుజరాత్ సర్కారు అభ్యంతరాలు తెలిపింది. రైలును తగులబెట్టి 59 మంది ప్రాణాలు బలిగొన్నారని, దీన్ని అత్యంత అరుదైన ఘటనగా పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.
శిక్షాకాలం ముగియకముందే విడుదల చేయడం తగదని స్పష్టం చేసింది. టాడా చట్టం కింద దోషులకు శిక్షలు పడ్డాయని, చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దీనిపై విచారణను 3 వారాలు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
కాగా, 2002, ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైలు స్టేషను వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు తగలబడి 59 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఇది సంచలన రేపింది. ఇప్పటికి కూడా గోద్రాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.