Ayodhya Ram Mandir: రామ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు: హోంమంత్రి అమిత్ షా
అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరు అడ్డుకోలేరని..మరికొన్ని రోజుల్లో వైభవమైన రామ్ మందిరాన్ని మనం చూడబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
- Bharath Reddy
- Published On : December 31, 2021 / 05:00 PM IST
Ram Mandir
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరు అడ్డుకోలేరని..మరికొన్ని రోజుల్లో వైభవమైన రామ్ మందిరాన్ని మనం చూడబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించిన అమిత్ షా.. ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. గతంలో ఉత్తరప్రదేశ్ ను పాలించిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రామ్ మందిర నిర్మాణాన్ని అడ్డుకున్నాయని..వారికీ కావాల్సిందల్లా ప్రజల డబ్బు అధికారమేనని అమిత్ షా మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ హయాంలో కరసేవకులను కాల్చి చంపారని, మృతదేహాలను సరయూ నదిలో విసిరేశారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేసారు. రామ నవమి, దీపోత్సవం లేకుండా.. “రామ్ లల్లా”(అయోధ్యలో రాముడి విగ్రహాలు) ఏళ్లకేళ్లుగా గుడారాల్లో ఉండాల్సి వచ్చిందని దీనంతటికి కారణమెవరంటూ అమిత్ షా ప్రశ్నించారు. ఇక బీజేపీ పాలనలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని అమిత్ షా హెచ్చరించారు.
Also Read: Maoist Dump: ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో భారీగా మావోయిస్టు డంపు స్వాధీనం
బంధు ప్రీతీ, పక్షపాతధోరణి, వలస విధానం అనే అంశాలపైనే సమాజ్ వాదీ పార్టీ పనిచేసిందంటూ దుయ్యబట్టిన అమిత్ షా.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. ఆమూడింటి స్థానంలో.. అభివృద్ధి, వ్యాపారం, సాంస్కృతిక వారసత్వం అనే అంశాలను తీసుకొచ్చి ప్రజలకు మంచి పాలన అందిస్తుందని అన్నారు. ఇటీవల సమాజ్ వాదీ మద్దతుదారులైన అత్తరు వ్యాపారుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులను ప్రస్తావించిన అమిత్ షా.. ఆ అత్తరు వాసన చూస్తుంటేనే.. సమాజ్ వాదీ పార్టీ అవినీతి ఎంతలా ఉందొ అర్ధం అవుతుందంటూ చురకలంటించారు. కాగా ఒక రోజు పర్యటన నిమిత్తం అయోధ్య చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముందుగా అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.
Also Read: TS High Court: మంచిరేవులలో ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే: పదేళ్ల తరువాత హైకోర్ట్ తీర్పు
