India Covid 19 Second Wave 27thousand Covid Deaths And Corona Cases With In Week
India Covid-19 Second Wave : భారత్పై కరోనా సెకండ్వేవ్ గడిచిన వారం భారీ విస్పోటనం సృష్టించింది. కరోనా వైరస్ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్ తిరగరాసింది. గత వీక్లోనే కరోనా పీక్స్కు వెళ్లింది. ఈ ఏడురోజుల్లో ఏకంగా 27 వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్క వారంలో కరోనాతో ఇంత మంది ఎప్పుడూ చనిపోలేదు. ఇక మరణాల శాతం గత మూడు రోజులుగా ప్రతిరోజూ ఒక్క శాతానికిపైగా రికార్డయింది.
అంటే కరోనా బారిన పడ్డ ప్రతి 100 మందిలో ఒక్కరూ కంటే ఎక్కువగా చనిపోయారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అటు కేసులు కూడా పోయిన వారంలో భారీగా నమోదయ్యాయి. ఈ ఏడురోజుల్లోనే ఏకంగా 27లక్షల 40 వేలమందికి పైగా కరోనా బారిన పడ్డారు. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ వారంలోనూ ఇన్ని కేసులు రికార్డుకాలేదు. ఇటు భారత్పై కరోనా భీకరదాడి కొనసాగుతూనే ఉంది.
ఒక్కరోజులో 3 లక్షల 66 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజుల పాటు రోజుకు 4 లక్షలకు పైగా రికార్డయిన కేసులు ఆరో రోజు 4 లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అటు మరణాలు కూడా 4 వేల తక్కువగా రికార్డయ్యాయి. 24గంటల్లో కరోనాతో 3 వేల 751 మంది కరోనాతో చనిపోయారు.