Pahalgam attack: బార్డర్లో హద్దు మీరొద్దు.. హాట్లైన్ సంభాషణలో పాక్కు భారత డీజీఎంవో వార్నింగ్..
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : May 1, 2025 / 09:05 AM IST
India-Pakistan border
Pahalgam attack: పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతుంది. గత కొన్నిరోజులుగా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వెంట సైనిక పోస్టులను టార్గెట్ చేసి పాక్ సైకులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో పాకిస్థాన్ తీరుపై భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దు మీరితే సహించేది లేదని, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) నుంచి నామినేట్ చేయబడిన ఇరుదేశాల అధికారులు హాట్లైన్ ద్వారా ఈ విషయంపై మాట్లాడారు.
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది. సరిహద్దు అంశాలపై సాధారణ చర్చల్లో భాగంగా ఇరుదేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు మంగళవారం రాత్రి హాటల్ లైన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం తీరుపై భారత డీజీఎంవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దువెంట కాల్పులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
డీజీఎంవో హాట్లైన్ అంటే ఏమిటి?
హాట్లైన్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో ) మధ్య ఏర్పాటు చేసిన ఒక కమ్యూనికేషన్ లైన్. ఇది సాధారణంగా సరిహద్దు సమస్యలు, ఇతర సైనిక సంబంధిత విషయాలను చర్చించడానికి ఉపయోగిస్తారు. రెండు దేశాల సైనిక అధికారులు ఒకరితో ఒకరు తక్షణమే మాట్లాడవచ్చు. సరిహద్దు ఉల్లంఘనలు, కాల్పుల విరమణ ఒప్పందాల గురించి చర్చలు జరపొచ్చు. అవసరమైనప్పుడు ఒకరి నుంచి మరొకరికి సహాయం అందించడానికి ఈ హాట్ లైన్ సంభాషణ చేస్తారు. పాకిస్తాన్ నుండి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనల గురించి, లేదా ఇతర సైనిక సమస్యల గురించి సమాచారం అందించడానికి భారత్ డీజీఎంవో పాకిస్తాన్ డీజీఎంవోను హాట్లైన్ ద్వారా సంప్రదిస్తుంది. చైనా, భారత్ మధ్య కూడా డీజీఎంవో హాట్లైన్ ఉంది. ఇది సరిహద్దు, ఇతర సైనిక సమస్యల గురించి చర్చించడానికి ఉపయోగించబడుతుంది.
