Rahul Gandhi: ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘ ఇండియా.. అంటే భారత్.. రాష్ట్రాల సమితి. ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన అనేది మనదేశ సమాఖ్య, రాష్ట్రాలపై దాడి చేయడమే అవుతుంది ’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
సమాఖ్య, ఏక కేంద్ర వ్యవస్థల సమ్మేళనమైన భారత్లో ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ అంటోంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక యోచన చాలా కాలంగా ఉంది. ఈ విధానంలో ఎన్నికల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, ఎన్కే సింగ్, హరీశ్ సాల్వే, సుభాష్, సంజయ్ కొఠారీ, గులాం నబీ ఆజాద్ ఉన్నారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక సహా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.