Operation Ganga : యుక్రెయిన్లో సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ మంగళవారం (మార్చి 8న) ప్రారంభమైంది. సుమీ నగరం నుంచి భారతీయ విద్యార్థులు 12 బస్సుల్లో బయల్దేరారు. వీరంతా బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యార్థుల బస్సులకు ఎస్కార్ట్ గా భారత ఎంబసీ, రెడ్ క్రాస్ అధికారులు కూడా వెళ్తున్నారు. భారతీయ విద్యార్థులతో పాటు బంగ్లా దేశీయులు, నేపాలీలను కూడా తరలిస్తున్నారు. యుక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులందరిని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగలో భాగంగా విజయవంతంగా స్వదేశానికి చేర్చుతూ వచ్చింది. ఇప్పటికే పలు ప్రత్యేక విమానాల్లో భారతీయులు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. మరికొంతమంది భారతీయులను కూడా కేంద్రం తరలింపు ప్రక్రియను కొనసాగించింది.
ఇప్పటికే వందలాది మంది భారతీయులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. చివరిగా సుమీ నగరంలో కూడా చిక్కుకున్న భారతీయులను తరలిస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థులతో కోఆర్డినేట్ అయ్యే వ్యక్తి ఒకరు మీడియాకు వెల్లడించారు. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను పోల్టావాకు తరలించినట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ధ్రువీకరించారు. కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. 694 మంది విద్యార్థులు సుమీలో చిక్కుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ గంగలో భాగంగా చివరి దశలో వీరంతా బస్సుల్లో స్వదేశానికి బయల్దేరినట్టు తెలుస్తోంది.
యుక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారతీయ పౌరుడిని సురక్షితంగా స్వదేశానికి చేర్చడమే లక్ష్యంగా భారత్ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం యుక్రెయిన్, రష్యా దేశాధినేతలతో చర్చలు జరిపారు. భారతీయుల తరలింపునకు సహకరించాలని రష్యా అధికారులను మోదీ కోరారు. ఇప్పటివరకు భారత్ 17,100 మంది పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఇదివరకే.. ఆపరేషన్ గంగలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. 10 ఎయిర్ ఫోర్స్ విమానాల్లో 2056 మందిని స్వదేశానికి తరలించినట్టు పేర్కొంది.
అలాగే సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ కు చేరుకున్నారు. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ ప్రారంభంకాగా.. అప్పటినుంచి యుక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికిపైగా భారతీయులను స్వదేశానికి తరలించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక మంగళవారం (మార్చి 8)న మరో 2 విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఆపరేషన్ గంగ దాదాపు పూర్తి అయినట్టే కనిపిస్తోంది. మరో రెండు వేల మంది వరకు రొమేనియా, స్లొవేకియా, మాల్డోవా దేశాల్లో భారత్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Read Also : Evacuate Ukraine : ఏదో ఒక మార్గం ద్వారా యుక్రెయిన్ వీడండి.. భారతీయులకు కీలక సూచన