Evacuate Ukraine : ఏదో ఒక మార్గం ద్వారా యుక్రెయిన్ నుంచి బయటపడండి.. భారతీయులకు కీలక సూచన
యుక్రెయిన్లో(Evacuate Ukraine) ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని..
Evacuate Ukraine : యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు యుక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. యుక్రెయిన్లో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మార్గం సుగమమైందని.. తక్షణమే అందుబాటులో ఏ ప్రయాణ మార్గం (రైళ్లు, వాహనాలు) ఉంటే దాని ద్వారానే యుక్రెయిన్ను వీడాలని ఇండియన్ ఎంబసీ భారతీయులను కోరింది. యుక్రెయిన్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని ఆందోళన వ్యక్తం చేసిన ఎంబసీ.. ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయులను(Evacuate Ukraine) కోరింది.
యుక్రెయిన్లోని ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరుల తరలింపునకు మానవతా కారిడార్లు ఏర్పాటు చేశారు. భారతీయల పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైళ్లు, వాహనాలు, అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఆశ్రయించి బయటపడాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి మానవతా కారిడార్లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది స్పష్టత లేదు” అని యుక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. (Evacuate Ukraine)
కాగా, యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల తరలింపులో భారత్ ఆందోళన వ్యక్తం చేయడంతో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. యుక్రెయిన్లోని సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు సురక్షితంగా చేపట్టాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో సంభాషించారు. అయితే కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్ నగరాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది. అయితే రష్యా ప్రకటించిన తరలింపు రూట్లపై యుక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దారులన్నీ రష్యా, బెలారస్ వైపు వెళ్తున్నట్లు ఆరోపించింది. తరలింపు ప్రక్రియ అనైతికంగా ఉన్నట్లు విమర్శించింది. (Evacuate Ukraine)
యుక్రెయిన్పై దండెత్తిన రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే యుద్ధం మొదలై 13 రోజులు అయినా… రష్యా ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి యుక్రెయిన్పైకి తన అమ్ముల పొదిలోని 500 కేజీల బాంబులను రష్యా ప్రయోగిస్తోంది. (Evacuate Ukraine)
ఈ క్రమంలో పుతిన్ను ఓ మృగంగా అభివర్ణించిన జెలెన్ స్కీ.. యుక్రెయిన్ను ఆక్రమించడంతోనే పుతిన్ ఆకలి తీరదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దండయాత్ర యుక్రెయిన్తో ఆగదని, ఇతర దేశాలపైనా ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘పుతిన్ ఓ మృగం లాంటివాడు. ఆయన ఎప్పటికీ సంతృప్తి చెందడు. తినేకొద్దీ ఇంకా కావాలంటూ ఆ మృగం మిగిలిన దేశాలపైనా పడుతుంది’ అని జెలెన్ స్కీ హెచ్చరించారు.
కాగా, రష్యా-యుక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. బెలారస్ వేదికగా మూడోసారి సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు… ఎలాంటి ముందడుగు వేయలేకపోయారు. చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే… చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని యుక్రెయిన్ ప్రతినిధి ప్రకటించగా… రష్యా ప్రతినిధి మాత్రం… తమ అంచనాలను రీచ్ కాలేకపోయామని చెప్పారు.
మూడో రౌండ్ చర్చల్లో ముఖ్యంగా యుక్రెయిన్ నగరాల నుంచి మానవతా కారిడార్ల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించారు. కీవ్, మరియుపోల్, ఖార్కివ్, సుమీ నుంచి ప్రజల తరలింపునకు కారిడార్లు ఏర్పాటు చేయాలన్న రష్యా ప్రతిపాదనను యుక్రెయిన్ తిరస్కరించింది. ఆ కారిడార్ల ద్వారా ప్రజలను రష్యాకు, బెలారస్కు మాత్రమే తరలిస్తామనడంతో అందుకు యుక్రెయిన్ అంగీకరించలేదు. దీనిని అనైతిక చర్యగా అభివర్ణించింది.