Cheetahs Landed In India: 1970లోనే చీతాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఇందిరాగాంధీ.. ఎందుకు సాధ్యపడలేదంటే?
1952లో చీతాలు అంతరించిపోతే.. ఇప్పటి వరకూ మనదేశంలో వాటిని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరగలేదా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. వాస్తవానికి అలాంటి ప్రయత్నాలు పలు దఫాలుగా జరిగాయి. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ సఫలం కాలేదు.
- Harishth Thanniru
- Updated on- September 17, 2022 / 04:28 PM IST
Cheetahs Landed In India
Cheetahs Landed In India: భారత్లోకి చీతాలు ఎంట్రీ ఇచ్చాయి. దేశంలో చీతాల సంతతిని తిరిగి పెంచడంకోసం కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలోఉన్న కునో నేషనల్ పార్క్లో ఉంచారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ పార్కులో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్వారెంటైన్ ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. నాలుగు నుంచి పది వారాల పాటు వీటిలోనే చీతాలను ఉంచుతారు. వాటిలో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? అనే విషయాలను జాగ్రత్తగా గమనించనున్నారు.
1952లో భారత్ దేశం ఈ చీతాలను అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. అయితే.. 1952లో చీతాలు అంతరించిపోతే.. ఇప్పటి వరకూ మనదేశంలో వాటిని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరగలేదా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. వాస్తవానికి అలాంటి ప్రయత్నాలు పలు దఫాలుగా జరిగాయి. 1952 సంవత్సరంలో భారత్ లో తొలిసారి వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్ జరిగింది. చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని గుర్తించింది. 1970లో చీతాలను మన దేశానికి తెప్పించేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రయ్నతించారు. 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అక్కడి చీతాలను భారత్కు రప్పించి అందుకు బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి.
Cheetahs Releases: చీతాలను కునో నేషనల్ పార్కులోని ఎన్క్లోజర్లోకి విడుదల చేసిన ప్రధాని.. గ్యాలరీ
భారత అభ్యర్థనకు ఆ దేశం కూడా సానుకూలంగా స్పందించింది. కానీ ఇరాన్ షా అధికారాన్ని కోల్పోవడం, అత్యవసర పరిస్థితి విధించాల్సి రావడంతో చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ తిరిగి 2009లో చీతాలను భారత్ కు తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు చొరవ చూపారు. మన్మోహన్ హయాంలో ఆఫ్రికన్ చీతాలను తేవాలని నిర్ణయించారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో సుమారు 70ఏళ్లుగా కొనసాగుతున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి. నమిబియా నుంచి ప్రత్యేక విమానంలో ఎనిమిది చీతాలు భారత్ లోకి అడుగు పెట్టాయి.
