It is true that Veer Savarkar apologised to the Britishers says Tushar Gandhi
Veer Savarkar: వీర్ సావర్కర్ ద్రోహి అని, బ్రిటీష్కు తొత్తుగా వ్యవహరించారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మహాత్మ గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సమర్ధించారు. జైలు నుంచి బయటికి రావడానికి బ్రిటిషర్లకు సావర్కర్ క్షమాపణలు చెప్పిన మాట వాస్తవమేనని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయని, అయితే వాట్సాప్ యూనివర్సిటీ (బీజేపీ ఐటీసెల్) చెప్పే మాటలు అవాస్తవమని తుషార్ గాంధీ అన్నారు.
శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్తో కలిసి నడిచారు, ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లతో సావర్కర్ స్నేహం చేసిన మాట వాస్తవమే. అంతే కాదు జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిటిషర్లకు క్షమాపణ కూడా చెప్పారు. చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి, వాట్సాప్ యూనివర్సిటీ చూపిస్తున్న సావర్కర్ నిజం కాదు’’ అని అన్నారు.
ఇక భారత్ జోడో యాత్రపై ఆయన స్పందిస్తూ ‘‘యాత్ర అనేది ఇక్కడి సంస్కృతిలో భాగం. యాత్రలు దేశంలో అనేక విప్లవాలకు నాంది పలికాయి. మన మహనీయులు నిర్మించిన విలువలకు వ్యతిరేకంగా దేశం నేడు పయనిస్తోంది. మనం ఏది వదులుకోకూడదో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
గురువారం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లకు వీర్ సావర్కర్ రాసిన లేఖలో ‘సర్, నేను మీకు నమ్మకైన బంటుగా ఇక నుంచి ఉంటానని మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని అన్నారు, అందులో ఆయన సంతకం కూడా ఉంది. బ్రిటిషర్లకు సావర్కర్ సహాయం చేశారు. అలాగే మహాత్మా గాంధీ, జవహార్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారికి ద్రోహం చేశారు’’ అని అన్నారు.
కాగా, రాహుల్ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ కేసు నమోదు చేశారు. దీనిపై గురువారం ఆయన స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాను’’అని చెప్పారు.