Jayalalithaa Death: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక కుట్ర ఉందంటూ జస్టిస్ ఆరుముగసామి కమిషన్ శాసనసభలో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగసామి కమిషన్ విచారణ జరిపింది. జయలలిత నిచ్చెలి శశికళ, అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ రామ్మోహన్ రావును విచారించాలని, చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
జయలలిత పరిస్థితిపై తప్పుడు ప్రకటనలు చేశారని నివేదికలో కమిషన్ పేర్కొంది. అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్రెడ్డిపై నివేదికలో పలు అంశాలు వెల్లడించింది. జయలలిత మృతి సమయంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలను నివేదిక ద్వారా బయటపెట్టింది. జయలలిత 2016, డిసెంబరు, 5న రాత్రి 11.30 నిమిషాలకు మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయని పేర్కొంది. మరోవైపు, జయలలితను ఉంచిన వార్డులో విధుల్లో ఉన్న సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం మాత్రం జయలలిత 2016, డిసెంబరు 4న సాయంత్రం 3.50 నిమిషాలకు మరణించారని తెలిపింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..