Karnataka CM: సినిమా చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన కర్ణాటక సీఎం..
సినిమా చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. మనిషి, కుక్క మధ్య బంధాన్ని తెరపై చూపుతూ జూన్ 10న కిరణ్రాజ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి కొత్త చిత్రం ‘777 చార్లీ’ సినిమా ఐదు భాషల్లో విడుదలైన విషయం విధితమే.
- Harishth Thanniru
- Published On : June 14, 2022 / 04:03 PM IST
Karnataka Cm
Karnataka CM: సినిమా చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. మనిషి, కుక్క మధ్య బంధాన్ని తెరపై చూపుతూ జూన్ 10న కిరణ్రాజ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి కొత్త చిత్రం ‘777 చార్లీ’ సినిమా ఐదు భాషల్లో విడుదలైన విషయం విధితమే. కాగా ఈనెల 13న ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చూశారు. ఈ సినిమాను చూస్తూ బసవరాజ్ బొమ్మై తన కుక్కను గుర్తు చేసుకొని కన్నీరు ఆపుకోలేక పోయారు.
సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం.. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర బృందాన్ని ప్రసంశించారు. కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. ‘777చార్లీ’ సినిమాలో కుక్క కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుందని తెలిపారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది అంటూ.. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకుంటూ సీఎం కన్నీళ్లను ఆపుకోలేక పోయారు. మీడియాతో మాట్లాడుతూనే బోరుమని విలపించారు. దీనికితోడు ఈ సినిమా చూస్తూ థియేటర్ లో ఏడుస్తున్న ముఖ్యమంత్రి ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అది వైరల్ గా మారింది.
Cm Basavaraj Bommai And Family Bids Adieu To Their Pet Dog.(file Photo)
స్వతహాగా బసవరాజ్ బొమ్మై కుక్కల ప్రేమికుడు. గతంలో స్నూబీ అనే కుక్కను పెంచుకున్నారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ కుక్క కన్నుమూసింది. దానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో సీఎం వెక్కి వెక్కి ఏడ్చారు. అందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా బసవరాజ్ బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు.
