Karnataka Politics: 2018 ఎన్నికల అనంతరం, అనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ.. రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటుంది. తాజాగా కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడ్డాయి. పార్టీలో అగ్ర నేతల నుండి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా బొమ్మై సీఎం పీఠం దిగిపోతారంటూ ప్రచారం మొదలెట్టారు కొందరు వ్యక్తులు. ఈవిషయం కాస్త బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లగా, రంగంలోకి దిగిన పార్టీ నేతలు అనిశ్చితిని తొలగించి స్పష్టమైన వివరణ ఇచ్చారు.
Also Read: Leopard attack pet dog: గేటు దూకి వచ్చి పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత
అసలేం జరిగింది?. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవల హవేరి జిల్లాలోని తన స్వస్థలం షిగ్గావ్ లో పర్యటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సీఎం బొమ్మై మాట్లాడుతూ “పదవులు శాశ్వతం కాదు, తాను కోరుకుంటే పదవి రాలేదంటూ” కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. దీంతో కర్ణాటక బీజేపీలో ఏదో లుకలుకలున్నాయని భావించిన ప్రతిపక్షాలు, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు మొదలెట్టాయి. అంతే కాదు సీఎం బొమ్మై మోకాలి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారంటూ కూడా ప్రచారం చేసారు. ఇక ఈ విషయాలపై స్పందించిన బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు గట్టి వివరణ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, శనివారం మాట్లాడుతూ.. కర్ణాటకలో 2023 ఎన్నికల వరకు సీఎంగా బసవరాజ్ బొమ్మై కొనసాగుతారని స్పష్టం చేసారు. రాజకీయంగా అలజడి సృష్టించేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ఇలాంటి కట్టుకథలు వ్యాపింపజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి స్పందిస్తూ.. కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై నూటికినూరుపాళ్లు న్యాయం చేస్తున్నారని ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. బీజేపీ అంటే గిట్టని వ్యక్తులు రాజకీయ కుట్రకు తెరలేపి ఉంటారని, అందుకే ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ప్రహ్లద్ జోషి మండిపడ్డారు. కాగా కర్ణాటక సీఎంగా 2021 జులై 28న బీఎస్ ఎడియూరప్ప దిగిపోగా, జులై 29న బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: TDP Leaders Protest : కుప్పం పోలీసుస్టేషన్ ముందు టీడీపీ నేతల నిరసన