Kerala Coastal Areas : రాబోయే ఏళ్లలో కేరళ తీర ప్రాంతాల్లో విపత్తు పొంచి ఉంది.. నిపుణుల హెచ్చరిక
రాబోయే కొన్నేళ్లలో కేరళ తీర ప్రాంతాల్లోని సముద్ర మట్టం పెరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల విపత్తులకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
- Sreehari A
- Published On : June 5, 2021 / 09:37 PM IST
Kerala Coastal Areas To Witness Increasing Sea Surge In Coming Years Experts
Kerala Coastal Areas Sear Surge : రాబోయే కొన్నేళ్లలో కేరళ తీర ప్రాంతాల్లోని సముద్ర మట్టం పెరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల తీర ప్రాంతాల్లోని సముద్రం పెరిగి విపత్తులకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొచ్చికి చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CMFRI) నిర్వహించిన వెబ్నార్లో నిపుణులు ప్రసంగించారు.
అధిక అలలు, సముద్ర కోత కారణంగా తీరప్రాంతంలో విపత్తులపై ఆందోళన వ్యక్తం చేశారు. మడ అడవులకు ప్రాధాన్యతనిస్తూ తీరప్రాంత వృక్షాలను పునరుద్ధరించాలను కోరారు. తౌక్టే, యాస్ వంటి రెండు తుఫానుల సమయంలో కేరళ తీరం మొత్తం ఇటీవల కోతకు గురైందని తెలిపారు.
హిందూ మహాసముద్రంలో జలాలు వేగంగా వేడెక్కడం వల్ల రాబోయే సంవత్సరాల్లో తీరంలో ఇలాంటి తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా తుఫాను గాలులతో విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. తీర కుగ్రామంలో అధిక అలలు, సముద్ర కోతతో వరదలు సంభవిస్తాయని చెబుతున్నారు.
ఈ తీర ప్రాంతంలో మడ అడవులు, ఇతర జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా కేరళ తీరప్రాంతాన్ని సముద్ర కోత నుంచి చాలా వరకు రక్షించవచ్చని సిఎంఎఫ్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎ గోపాలకృష్ణన్ తెలిపారు. తీరప్రాంత జీవవైవిధ్య పరిరక్షణ, నిర్మాణాలతో సహా అనేక కారణాల వల్ల క్షీణించిపోతోంది. సముద్రపు అల్లకల్లోలం నుంచి తీరప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
మడ అడవులు తీరప్రాంతానికి బయో షీల్డ్గా పనిచేస్తాయని అన్నారు. ముంబై తీరప్రాంతంలో పరిశీలనల ఆధారంగా మడ అడవులు తీర అలల తాకిడి, తీవ్రమైన ఉప్పెనల నుంచి రక్షిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. కేరళలో తీరప్రాంతంలో మడ అడవులను సంరక్షించుకోవాలని గోపాలకృష్ణన్ చెప్పారు. కేరళ తీరం వెంబడి తీరప్రాంత వృక్షాలను పునరుద్ధరించాలని తెలిపారు. ఈ ప్రాంతంలోని నివాసితులను రక్షించేందుకు తీరం వెంబడి బయో గ్రీన్ బెల్ట్ నిర్మించాలని సూచించింది.
