Travancore Devaswom Board : అయ్యప్ప మాలదారులకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90వేల బుకింగ్ లు, 30వేల స్పాట్ లో బుకింగ్స్ ఉంటున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, పెద్ద సంఖ్యలో శబరిమలకు క్యూ కట్టారు. ఫలితంగా దర్శనాలను త్వరితగతిన సాఫీగా సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read : Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ఆయన కుమార్తె సంచలన వ్యాఖ్యలు .. వీడియో విడుదల
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల – మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. అయ్యప్ప దర్శనంకోసం కేరళ నుంచే కాకుండా పొరుగున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. అయితే, గత వారంరోజులుగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీడీబీ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన సమయాన్ని గంట పొడిగించింది. సాయంత్రం దర్శనం 4 గంటలకు బదులు 3 గంటల నుంచే మొదలు పెట్టేందుకు నిర్ణయించారు. దీంతో సాయంత్రం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
గత వారం రోజులుగా పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో సుమారు 20 గంటల సమయం పడుతుంది. దీంతో కొందరు క్యూలైన్లను బ్రేక్ చేసి బారికేడ్లు దూకి పథినెట్టంబడిని చేరుకుంటున్నారు. ఇలాగైతే లాభం లేదని ఆన్ లైన్ క్యూ బుకింగ్ ను 90వేల నుంచి 80వేలకు కుదించారు. దీనికితోడు దేవస్థానం వర్గాలు ఇకపై వస్తున్న భక్తులను పంబా వద్దనే నిలిపివేస్తున్నారు. సన్నిదానం, పంబా వద్ద అదనపు పోలీసుల బలగాలను మోహరించారు.
మరోవైపు శబరిమలలో విషాదం చోటు చేసుకుంది. అప్పచిమేడులో దర్శనంకోసం నిరీక్షణలో ఉన్న తమిళనాడుకు చెందిన 11ఏళ్ల బాలిక పద్మశ్రీ అస్వస్థతకు గురైంది. ఆమెను పంపా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.