ఇండియా రివేంజ్ స్టార్ట్.. ఫస్ట్ హిట్ లో లష్కర్ ఈ తోయిబా టాప్ కమాండర్ ఖతం
లష్కరే ఈ తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
- Harishth Thanniru
- Published On : April 25, 2025 / 12:38 PM IST
Lashkar e Taiba top terrorist altaf lali killed
Pahalgam Attack: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదులను ఏరివేతలో ఇండియన్ ఆర్మీ నిమగ్నమైంది. దీంతో భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. ఈ క్రమంలో లష్కరే ఈ తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. బందీపొరాలో అల్తాఫ్ ఆచూకీ తెలియడంతో.. శుక్రవారం ఉదయం ఆర్మీ – పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టి హతమార్చాయి.
ఆర్మీ, పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ సమయంలో జవాన్లను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఈ క్రమంలో భద్రతాదళాలు అల్తాఫ్ ను మట్టుబెట్టాయి. ఇదిలాఉంటే.. పహల్గాంలో ఉగ్రదాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు.
పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు.. దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జావాన్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడైనా యుద్ధం మేఘాలు కమ్ముకోవచ్చునని తెలుస్తోంది.
