Leopard : జనవాసాల్లోకి వస్తున్న చిరుతపులులు… మళ్లీ బెడ్రూంలోకి వచ్చిన చిరుతపులి
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
- saleem sk
- Published On : November 20, 2023 / 06:09 AM IST
Leopard
Leopard : ఇటీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది. నాసిక్లోని ఓ చిరుతపులి బెడ్రూమ్లోకి చొరబడగా, అటవీశాఖ అధికారులు దానిని రక్షించారు. చిరుతపులి నాసిక్ నగరంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులోని బెడ్రూమ్లో దాగి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ALSO READ : Anushka Sharma : భర్త కోహ్లీని ఓదార్చిన అనుష్క శర్మ…వైరల్ చిత్రం
అనంతరం అధికారులు ట్రాంక్విలైజర్తో కాల్చి చిరుతపులిని స్పృహ తప్పేలా చేసి మెట్లపై నుంచి కిందకు తీసుకువచ్చారు. చిరుతపులిని తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చిరుతపులి బెడ్రూం లోపలికి చొరబడినట్లు సమాచారం. ఇటీవల కాలంలో నివాస ప్రాంతాల్లో చిరుతపులులు కనిపించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మహారాష్ట్రలోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ ఆవరణలో బుధవారం చిరుతపులి సంచరిస్తూ కెమెరాకంటికి చిక్కింది.
భయాందోళనల్లో ఉద్యోగులు
మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్లోకి చిరుతపులి ప్రవేశించింది. కంపెనీ ఉద్యోగులు చిరుతపులి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి వేళల్లో సోదాలు నిర్వహించే సమయానికి జంతువు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
సోషల్ మీడియాలో వైరల్
చిరుతపులి సంచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుతపులి అడవిలో దారి తప్పి జనావాస ప్రాంతానికి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. కళ్యాణ్-ముర్బాద్ రోడ్లోని వరప్ గ్రామ వాసులు,టాటా పవర్ కంపెనీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దని కోరారు.
అటవీగ్రామాల్లో జనం భయం… భయం
సమీపంలోని ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం గురించి అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ వరప్ గ్రామ పరిసర ప్రాంతాల్లో బ్యానర్లను ఉంచింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక అధికారుల బృందాన్ని కూడా నియమించింది. ఇటీవల తరచూ చిరుతపులులు జనవాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో అటవీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోనలు వ్యక్తం చేశారు.
ఇంట్లో దాక్కున్న చిరుత
దీపావళి పటాకుల భయంతో ఓ చిరుతపులి ఇంట్లో దాక్కున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్లో దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఓ ఇంట్లో ఆశ్రయం పొందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి 15 గంటల పాటు ఇంట్లోనే ఉంది.
సీసీ కెెమెరాలు ఏర్పాటు
చిరుతపులిపై నిఘా ఉంచేందుకు అటవీశాఖ అధికారులు మూడు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి చిరుతపులి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందని మేం ఆశిస్తున్నామని అధికారులు చెప్పారు. చిరుతపులి కదలికలపై నిఘా ఉంచడానికి తాము సీసీటీవీని చూస్తున్నామని ముదుమలై టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ తెలిపారు.
