Palace On Wheels: దేశంలోని లగ్జరీ ట్రైన్లలో ఒకటి ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ప్రయాణానికి దూరంగా ఉన్న ఈ రైలు తాజాగా అందుబాటులోకి వచ్చింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. శనివారం ఈ రైలును తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ రైలు 40 ఏళ్లుగా సేవలందిస్తోందని, దీని ద్వారా రాజస్తాన్లో పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం కొద్దిసేపు రైలులోని సదుపాయాల్ని ఆయన పరిశీలించారు. రాజస్థాన్ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తున్నాయి. ఈ రైలులో ప్రయాణికుల కోసం లగ్జరీ సదుపాయాలు ఉంటాయి. 1982 నుంచి ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ మొదటి రైలు సేవలందిస్తోంది. ఎప్పటికప్పడు ఇదే సేవలతో కూడిన ఆధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నారు.
స్టార్ హోటల్లో ఉండే సదుపాయాల్ని ఈ రైలులో కల్పిస్తారు. ఈ రైలు ఢిల్లీ, ఆగ్రా నుంచి జైపూర్, జోధ్పూర్, ఉదయ్ పూర్, చిత్తోర్ఘర్, జైసల్మేర్, భారత్ పూర్ వరకు ప్రయాణిస్తుంది. ఇది మొత్తం ఏడు రోజుల ప్రయాణం. మధ్యలో అనేక పర్యాటక ప్రదేశాల్ని సందర్శించవచ్చు.