Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.1000 జరిమానా చెల్లించండి: ఆర్ఎస్ఎస్ నేతకు మహారాష్ట్ర కోర్టు ఆదేశం
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1,000 జరిమానాగా చెల్లించాలని మహారాష్ట్రలోని భివాండీలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేను ఆదేశించింది
- Bharath Reddy
- Published On : April 22, 2022 / 01:58 PM IST
Rahul
Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1,000 జరిమానాగా చెల్లించాలని మహారాష్ట్రలోని భివాండీలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతేను ఆదేశించింది. గతంలోనూ రూ.500 జరిమానా విధించగా కుంతే ఇంతవరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. మహాత్మాగాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమంటూ 2014లో ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతే కోర్టులో పిటిషన్ వేశారు. అయితే తన వ్యాఖ్యలను రాహుల్ సమర్ధించుకోగా కోర్టు 2018లో ఆయనపై అభియోగాలు మోపింది. ఆనాటి నుంచి ఈకేసుపై భివండీ కోర్టు విచారణ జరుపుతూనే ఉంది. అయితే విచారణ సమయానికి పిటిషన్ దారుడు, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి వరుసగా విచారణకు హాజరు కాలేకపోయారు.
Also read:Supreme Court : IPS AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రాహుల్ వ్యాఖ్యలను నిరూపించేందుకు పిటిషన్ దారుడు కోర్టును కొంత సమయం కోరగా..కోర్టు అందుకు సమ్మతించింది. అయితే రోజులు గడుస్తున్నా..పిటిషన్ దారుడు రాజేష్ కుంతే కోర్టు ఎదుట హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..గతేడాది కుంతేను మందలించి రాహుల్ గాంధీకి రూ.500 జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ మొత్తాన్ని చెలించడంలోనూ రాజేష్ కుంతే అలసత్వం ప్రదర్శించడంతో పాటు.. కోర్టులో కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి గైర్హాజరు అయి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు. దీంతో ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంతే పై శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసిన భివాండీలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రూ.1000 జరిమానా విధించాలని ఆదేశించింది.
మే 10న మరోసారి ఈ కేసు విచారణకు రానుందని, ఈలోగా రాజేష్ కుంతే తన జరిమానా మొత్తాన్ని రాహుల్ గాంధీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసులో ఢిల్లీ నుంచి తీసుకురానున్న సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కుంతే కోర్టుకు తెలిపారు. దీనిని మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించగా కుంతే ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశాడు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లలో ఒకటి బాంబే హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున వాయిదాలు కోరుతున్నట్లు కుంతే తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Also read:CM kejriwal : కర్ణాటకలోనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం :కేజ్రీవాల్
