Minister Dada Bhuse comments
Maharashtra Minister Dada Bhuse : దేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీ పెరిగిన విషయం తెలిసిందే. ఓ వైపు ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకం విధించడంపై రైతులు, వ్యాపారస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. అని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఉల్లిగడ్డను తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవన్నారు. ప్రధానంగా వంటల్లో ఉల్లిగడ్డను వాడినా వాడక పోయినా పెద్ద తేడా ఏమీ లేదని తెలిపారు.
Viral Video: భారత్లో కూరగాయలు కొనుక్కున్న జర్మనీ మంత్రి.. ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..
‘మీరు 10 లక్షల విలువైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు, రిటైల్ ధర కన్నా 10 నుంచి 20 రూపాయలకు ఎక్కవగా సరుకును కొనవచ్చు, అదేమీ మీకు పెద్ద భారం కాదు’ అని అన్నారు. రైతులు, వ్యాపారులతో సరైన సమన్వయంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కొక్కప్పుడు క్వింటాల్ రూ.200 మాత్రమే లభించే ఉల్లిగడ్డ మరో సమయంలో రూ.2000 ధర పలుకుతుందన్నారు.
దీని పరిష్కారానికి అందరితో చర్చలు జరపాలని సూచించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్రం విధించిన 40 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే ముంబైకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మిత్రపక్షమైన రైతు క్రాంతి సంఘటన్ హెచ్చరించింది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.