Mamatha Benarji
Mamata Banerjee arrives in Delhi for five-day visit: దేశ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన ధ్వయంగా నరేంద్ర మోదీ-అమిత్ షాలకు పేరుంది. వాళ్లిద్దరినీ ఢీకొట్టే ప్లాన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేశారా..? 2024 నాటికి విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా రేసులో ముందుండేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారా? బెంగాల్ రాజకీయాల నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యారా..? అంటే అవుననే మాటే పొలిటికల్ సర్కిల్లలో వినిపిస్తోంది. ఢిల్లీ పీఠంపై కన్నేసిన మమత హస్తిన పర్యటనలో ఆట మొదలు పెట్టేసింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అటు ప్రధానితో పాటు విపక్ష నేతలను కూడా గంటల వ్యవధిలోనే కలవనున్నారు దీదీ.
ఈ టూర్లోనే కాంగ్రెస్ కీలక నేతలతో దీదీ సమావేశం కానుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. బెంగాల్కు మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారిగా మమత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏడుసార్లు ఎంపీగా చేసిన మమత.. ఇటీవలే టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా కూడా ఎన్నికయ్యారు. ఢిల్లీ టూర్కు ముందు జరిగిన పరిణామం.. మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంకేతాలను స్పష్టం చేసినట్లేనని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ తన దృష్టి అంతా ఢిల్లీపైనేనని స్వయంగా ప్రకటించారు.
అయితే జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో ఢిల్లీ పీఠంపై కన్నేసిన మమత.. కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఇప్పుడు హస్తిన పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలు అందరినీ కలవనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తున్నారు. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు… పలు అంశాలపై కేంద్రం తీరుని ప్రశ్నించేందుకు ప్లాన్ చేస్తుంది మమతా.. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీని కలవడం ఆసక్తి కలిగిస్తోంది.
ఇదే టూర్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శరద్ పవార్తో పాటు విపక్షనేతలందర్నీ కలవనున్నారు మమతా బెనర్జీ. బీజేపీ వ్యతిరేక ఐక్య కూటమి ఏర్పాటు.. పెగాసస్ స్పై వేర్ అంశం, కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. సోనియాను కలవడం అంటే… కాంగ్రెస్కు దగ్గరవ్వడం ద్వారా దేశ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు టీఎంసీ అధినేత్రి ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 టార్గెట్గా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కమలదళాన్ని ఓడించడమే దీదీ టార్గెట్.. ఈ క్రమంలోనే టీఎంసీ నేతలు.. మమతను కాబోయే ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 2014లో 31శాతం ఓట్లతో, 2019లో 36శాతం ఓట్లతో మాత్రమే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీని గద్దె దించడం అంత కష్టమేమీ కాదన్నది మమత వాదన. ఇందుకోసం ఎన్డీయేలో లేని రాజకీయ పక్షాలను ఏకం చేయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బీజేపీయేతర కూటమిని దీదీ సాధ్యం చేయగలరా? మమత సారథ్యాన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా? పవార్, మాయావతి లాంటి నేతలను దీదీ హ్యాండిల్ చేయగలదా..? ఇప్పుడిదే హస్తినలో హాట్ టాపిక్.