Owaisi Satires on BJP Petrol Rate Hiked Because of Taj Mahal : ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని..దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటానికి కారణం అక్బర్ చక్రవర్తిదే అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందేంటీ తాజ్ మహల్ కట్టటానికి..దేశంలో పెట్రోల్ ధర పెరటానికి..దేశంలో నిరుద్యోగానికి..అక్బర్ చక్రవర్తికి సంబంధమేంటి? అని జుట్టుపీక్కుంటున్నారా? అందులోని ఇటువంటి వ్యాఖ్యలు చేసింది ఎంపీ అసదుద్ధీన్ చేయటమేంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. అసలు విషయం ఏమిటంటే..ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఎంపీ అసదుద్ధీన్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రతీ విషయాన్ని..అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని అసదుద్ధీన్ ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి మొఘల్లు బాధ్యులు కాదని..ముమ్మాటికి ప్రధాని మోదీయేనని ఒవైసీ కాషాయ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
మధ్యప్రదేశ్లోని ఓ బహిరంగ సభలో అసదుద్ధీన్ ప్రసంగిస్తూ..’దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ మాత్రం కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్ను ఇవాళ రూ.40కే అమ్మేవారు ప్రధాని మోదీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పు చేశారని నేను ఒప్పుకుంటాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది కదూ అంటే ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని బీజేపీ విషప్రచారం చేస్తోంది అంటూ బీజేపీపై విమర్శల దాడులు చేశారు అసదుద్ధీన్.
భారతదేశాన్ని మొఘలులే పాలించారా? అశోక్..చంద్రగుప్త మౌర్య పాలించలేదా? అంటూ ప్రశ్నించారు. కానీ బీజేపీ మాత్రం మొఘల్ల వల్లనే అంటూ ఆరోపణలు చేస్తోందని విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. తమ పూర్వీకులు మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించి భారతదేశంలోనే ఉండిపోయారనడానికి ఈ దేశంలోని 200 మిలియన్ల మంది ముస్లింలు సాక్షులని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు. భారత్ ఏ ఒక్కరి దేశమో కాదు మన అందరిది అని ఒవైసీ అన్నారు. మేము భారతదేశాన్ని విడిచిపెట్టము. ఇక్కడే ఉంటాం..ఈ మట్టిలోనే సమాధి అవుతాం అంటూ ఒవైసీ భావోద్వేగంతో ప్రసంగించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.