Mohan Bhagwat : ఆ చట్టాలు భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదు – మోహన్ భగవత్..
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ), భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఈ చట్టాలతో వారికి ఎలాంటి నష్టం లేదని రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
- kunduru Vinod
- Updated on- July 21, 2021 / 07:50 PM IST
Mohan Bhagwat
Mohan Bhagwat : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ), భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఈ చట్టాలతో వారికి ఎలాంటి నష్టం లేదని రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అస్సాం రాజధాని గౌహతిలో బుధవారం నాని గోపాల్ మహంత రచించిన ఎన్ఆర్సీ, సీఏఏ- అస్సాం చరిత్ర రాజకీయాలపై పౌరసత్వ చర్చ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు భగవత్..
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భారతదేశంలోని ముస్లిం పౌరులకు సీఏఏ వల్ల హాని జరగదని తెలిపారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో దీనిని హిందూ- ముస్లిం సమస్యగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది హిందూ – ముస్లింల విషయం కానే కాదు.. కేవలం కొన్ని రాజకీయ శక్తులు సృష్టిస్తున్న అపోహ అని తెలిపారు.
దేశ విభజన గురించి ప్రస్తావించారు భగవత్.. దేశ విభజన సమయంలో దేశ ప్రజల అభిప్రాయం తీసుకోలేదని.. ఆలా తీసుకోని ఉంటే ఈ దేశం విడిపోయేది కాదని తెలిపారు. కేవలం నేతలు తీసుకున్న నిర్ణయం వల్లనే దేశం రెండుగా చీలిపోయిందని తెలిపారు. విభజన అనంతరం చాలామందిని పాకిస్తాన్ ప్రాంతం నుంచి తరిమివేశారని, వారు ఆస్తులను వదిలేసి ప్రాణభయంతో భారత్ లోకి వచ్చారని తెలిపారు.
విభజన సమయంలో పాకిస్తాన్ లో చిక్కుకొని 75 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ మైనారిటీలుగా కొనసాగుతున్న వారు రక్షణ కోరి ఇక్కడికి వస్తే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చారని తెలిపారు. దీని వలన భారతీయ ముస్లిమ్స్ కి ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు.
