Loud Speakers: మతపరమైన ప్రదేశాలలో 6,031 లౌడ్ స్పీకర్లను శాంతియుతంగా తొలగించిన యూపీ ప్రభుత్వం
మతపరమైన ప్రదేశాల్లో 6,031 లౌడ్ స్పీకర్లను అధికారులు తొలగించారు. మరో 29,674 ప్రాంతాల్లో స్పీకర్ల శబ్దాన్ని పరిమితికి లోబడి తగ్గించాలని అధికారులు ఆదేశించారు.
- Bharath Reddy
- Published On : April 27, 2022 / 06:04 PM IST
Loudspeaker
Loud Speakers: మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పటుపై గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ కొందరు వ్యక్తులు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈమేరకు బుధవారం రాష్ట్రంలోని పలు మతపరమైన ప్రదేశాల్లో 6,031 లౌడ్ స్పీకర్లను అధికారులు తొలగించారు. మరో 29,674 ప్రాంతాల్లో స్పీకర్ల శబ్దాన్ని పరిమితికి లోబడి తగ్గించాలని అధికారులు ఆదేశించారు. వీటిలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి.
Also read:MEA Jaishankar: అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు: యూరోపియన్ యూనియన్కు విదేశాంగ మంత్రి చురకలు
లౌడ్ స్పీకర్ల తొలగింపుపై యూపీ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు..మతపరమైన ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందంగానే స్పీకర్లను తొలగిస్తు పోలీసులకు సహకరిస్తున్నారని, తొలగింపు ప్రక్రియ మొత్తం శాంతియుతంగానే జరుగుతున్నట్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరించారు. కాగా, పలు ప్రాంతాల్లో నిర్వాహకులు అనధికారికంగా ఇలా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
Also read:The Union Cabinet: ఎరువులపై సబ్సిడీ కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం
మీరట్ జోన్లో 1,215, బరేలీ జోన్లో 1,070, లక్నో జోన్లో 912, కాన్పూర్ జోన్లో 1,056, ప్రయాగ్రాజ్లో 1, గోరఖ్పూర్ జోన్లో 2, వారణాసి జోన్లో 1366, గౌతంబుద్ నగర్ లో 19, లక్నో కమిషనరేట్ లో 190 మరియు వారణాసి కమిషనరేట్లో 170 అనధికార లౌడ్స్పీకర్లను అధికారులు తొలగించారు. మరోవైపు ప్రస్తుత పండుగల దృష్ట్యా లౌడ్ స్పీకర్ల వినియోగంపై రాష్ట్రంలోని 37,344 మంది మత పెద్దలతో పోలీసు అధికారులు మాట్లాడారు. మరో రెండు రోజుల్లో రంజాన్ మాసం ముగుస్తున్నందున, 31,000 ప్రాంతాల్లో అల్విదా (రంజాన్ చివరి శుక్రవారం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో సున్నిత ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది.
Also read:PM Modi: విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రధాని మోదీ పిలుపు
