Lok Sabha Membership: బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ ( MP Afzal Ansari ) లోక్సభ సభ్యత్వంపై వేటు పడే అవకాశం ఉంది. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై ఇప్పటికే అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా, అపహరణ, హత్య కేసులో బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి ఘాజీపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
యూపీలో 2005లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణా నందరాయ్ (BJP MLA Krishnanand Rai) హత్య సహా నందకిశోర్ రుంగ్తా హత్య కేసులో మాజీ గ్యాంగ్స్టర్, యూపీ మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ విచారణ ఎదుర్కొన్నారు. వారిని కోర్టు దోషులుగా తేల్చి, ఇవాళ శిక్ష ఖరారు చేసింది.
మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష. రూ.5 లక్షల జరిమానా విధించింది. అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద వారి మీద 2007లో కేసు నమోదు చేసిన ఘాజీపూర్ మహమ్మాదాబాద్ పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించారు.
అయితే, ఈ కేసు 2007 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఈ కేసులోనే ఘాజీపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు చెప్పింది. కాగా, 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ముఖ్తార్ అన్సారీ దోషిగా తేలారు. 2002లో మహమ్మదాబాద్ నియోజకవర్గం నుంచి అఫ్జల్ అన్సారీపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కృష్ణానంద రాయ్.
అప్పటి నుంచి కృష్ణానంద రాయ్, అన్సారీ బ్రదర్స్ మధ్య గొడవలు చెలరేగాయి. 2005లో క్రికెట్ టోర్నీ ప్రారంభించి వస్తున్న సమయంలో కృష్ణానంద రాయ్ పై 8 మంది దాడి చేశారు. ఏకే 47లతో 500 రౌండ్ల కాల్పుల్లో కృష్ణానంద రాయ్ ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణానంద రాయ్ హత్యకు కుట్ర పన్నిన అన్సారీ బ్రదర్స్ పై ఇన్నేళ్లు విచారణ జరిగింది.
Uttar Pradesh: అజాంఖాన్ గుండెల్లో చావు భయం.. అతీక్ అహ్మద్ హత్య తర్వాత పెరిగిన ఆందోళన