Narendra Modi
Narendra Modi – BJP: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇవాళ షాహ్డోల్ (Shahdol) లో బీజేపీ నిర్వహించిన సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.
” కొందరు తప్పుడు హామీలు ఇస్తున్నారు. వారికే భరోసా లేదు కానీ, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అటువంటి హామీలు ఇచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు గిరిజనులకు పట్టించుకోలేదు.
మేము గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రత్యేకంగా గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం ” అని మోదీ చెప్పారు. గిరిజన మహిళను తాము దేశ రాష్ట్రపతిని చేయాలనుకుంటున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రవర్తించాయో అందరూ చూశారని అన్నారు.
” ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేయిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పార్టీలన్నీ కలవాలనుకుంటున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడానికే ఆ పార్టీలన్నీ కలుస్తున్నాయి ” అని మోదీ అన్నారు. కాగా, ఇప్పటికే బిహార్ రాజధాని పాట్నలో సమావేశం నిర్వహించిన ప్రతిపక్ష పార్టీలు త్వరలోనే మరోసారి భేటీ కానున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచించాలని భావిస్తున్నాయి.