ISRO: ఇస్రో చుట్టూ రాజకీయాలు.. మోదీకి కౌంటర్ ఇస్తూ చంద్రయాన్-1ను గుర్తుచేసిన కాంగ్రెస్
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
- T Venkateshwarlu
- Published On : August 26, 2023 / 04:28 PM IST
ISRO
ISRO – Narendra Modi: చంద్రయాన్-3 విజయవంతం కావడం వెనుక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. అందుకుగానూ మోదీ బెంగళూరు (Bengaluru) ఎయిర్పోర్టులో విమానం దిగిన సమయంలో ఆయనకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగానీ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గానీ ఆహ్వానం పలకలేదు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందంటూ పలు రకాలుగా కథనాలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ” సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించినందుకు మోదీ చాలా చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
అందుకే తనకు సీఎం తనకు స్వాగతం పలికేందుకు మోదీ నిరాకరించారు. ప్రొటోకాల్ కు ఇది వ్యతిరేకం. ఇవన్నీ చిల్లర రాజకీయాలే ” అని చెప్పారు. 2008లో చంద్రయాన్-1 గురించి జైరాం రమేశ్ గుర్తుచేశారు.
” చంద్రయాన్-1 ప్రయోగం తర్వాత 2008 అక్టోబరు 22న అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ను అప్పుడు సీఎంగా ఉన్న మోదీ సందర్శించలేదా? ఈ విషయాన్ని నేటి ప్రధాని మోదీ మర్చిపోయారా? చంద్రయాన్-1 విజయం సాధించిన సమయంలో భారత ప్రధానిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు ” అని అన్నారు.
కాగా, ఈ వివాదంపై మోదీ స్పందిస్తూ.. ‘ బెంగళూరుకి నేను ఎప్పుడు వస్తానో నాకే సరిగ్గా తెలియదు.. అందుకే గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంను ఎయిర్పోర్టుకి రావద్దని చెప్పాను ’ అని అన్నారు.
