NDTV: పూర్తిగా అదానీ చేతుల్లోకి NDTV.. డైరెక్టర్లుగా రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్
ఎలక్ట్రానిక్ మీడియా గురించి తెలిసిన వారికి ప్రణయ్ రాయ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు మీడియా రంగంలో ఉన్న ఆయన.. ఎంతో మంది గర్వించదగ్గ జర్నలిస్టుల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించారు. కాగా, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామాలను నవంబర్ 29న ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ ఆమోదించనుంది
- tony bekkal
- Published On : November 30, 2022 / 03:55 PM IST
NDTV co-founder Prannoy Roy, wife steps down as NDTV directors
NDTV: ఎన్డీటీవీ (న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) పూర్తిగా గౌతమ్ అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్డీటీవీ ఫౌండర్ అయిన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ డైకెర్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎన్డీటీవీ ఛానల్ ప్రమోటర్ గ్రూపు నుంచి ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఇక ఎన్డీటీవీపై పూర్తి యాజమాన్య బాధ్య అదానీదే. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేశారు. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. ఇప్పటికే 26 శాతం వాటా ఉన్న అదానీ గ్రూపుకి, తాజా కొనుగోలుతో 55.18 శాతం వాటా దక్కింది.
ఎలక్ట్రానిక్ మీడియా గురించి తెలిసిన వారికి ప్రణయ్ రాయ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు మీడియా రంగంలో ఉన్న ఆయన.. ఎంతో మంది గర్వించదగ్గ జర్నలిస్టుల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించారు. కాగా, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామాలను నవంబర్ 29న ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ ఆమోదించనుంది. వీరి స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్లను నూతన డైరెక్టర్లుగా ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ నియమించనుంది.
భిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తోన్న అదానీ గ్రూప్.. తాజాగా మీడియా రంగంలోకీ ప్రవేశించింది. ఇందులో భాగంగానే ఎన్డీటీవీలోని మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్డీటీవీలో అదానీ తొలుత పరోక్ష రూపంలో వాటా దక్కించుకున్నారు. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలు చేసి 29.18 శాతం వాటా దక్కించుకున్నారు. ఇక, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో కంపెని 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీన్ని సైతం అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్ టేకోవర్ చర్యలు చేపట్టిందని ఎన్డీటీవి చెబుతోంది.
Bilkis Bano Case: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం గడప తొక్కిన బిల్కిస్ బానో
