Basangouda Patil : భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు..సుభాష్ చంద్రబోస్ : బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
భారత్ తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వ్యాఖ్యానించారు.
- nagamani
- Published On : September 29, 2023 / 10:10 AM IST
BJP MLA Basangouda Patil Yatnal
BJP MLA Basangouda Patil Yatnal : భారత్ తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బసనగౌడ ప్రసంగిస్తు.. ‘నెహ్రూ మన తొలి ప్రధాని కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోసే మన తొలి ప్రధాని.. నేతాజీ వల్లే బ్రిటీష్ వారు భారత్ వదిలి వెళ్లిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. నేతాజీ బ్రిటీషర్లు భయం అంటే ఏంటో చూపించారని అందుకే వాళ్లు దేశం వదిలి వెళ్లిపోయారని అన్నారు. నిరాహార దీక్షలు చేసినందు వల్ల దేశానికి స్వాతంత్ర్యం రాలేదని..నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటీషర్లకు కలిగించిన భయం వల్లే అని అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటీషర్లు దేశం వదిలి వెళ్లిపోయినప్పుడు దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన సమయంలో స్వతంత్ర్య భారతదేశానికి నేతాజీయే మొదటి ప్రధాని అని అన్నారు..కాగా..బసనగౌడ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆగస్టులో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లేదా ఏడు నెలల్లో కూలిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఉందని దాని వల్లే కాంగ్రెస్ పతనం అవుతుందని అన్నారు. తాజాగా నెహ్రూ భారత తొలి ప్రధాని కాదు నేతాజీ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
