Lok Sabha elections 2024: విపక్షాల ఐక్యతలో మరో కీలక ఘట్టం.. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీతో కలిసిన మమతా బెనర్జీ?
Lok Sabha elections 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee )ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కలిశారు.
- T Venkateshwarlu
- Published On : April 24, 2023 / 03:17 PM IST
Lok Sabha elections 2024
Lok Sabha elections 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee )ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కలిశారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు (Lok Sabha elections 2024) జరగాల్సి ఉన్న నేపథ్యంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలని నితీశ్ కుమార్ భావిస్తున్నారు.
ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నితీశ్, తేజస్వీ యాదవ్ కలిశారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పోవాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని వారాల క్రితం మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం పాటించాలని తమ పార్టీ టీఎంసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీని ఇవాళ పశ్చిమ బెంగాల్ సచివాలయంలో కలవడం గమనార్హం. అంతేగాక, ఉత్తరప్రదేశ్ వెళ్లి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ కుమార్ ను కలవనున్నారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ కు టీఎంసీ కాస్త దగ్గరవుతున్నట్లు కనపడుతోంది. బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ నిర్ణయించిన నేపథ్యంలో ఇదో చారిత్రక అడుగు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
దేశంలో వీలైనన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని నితీశ్ కుమార్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఇటీవల మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ కి దూరంగా ఉంటూనే కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడంతో కాంగ్రెస్ ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం పడినట్లయింది.
