No confidence motion notice against Bihar assembly speaker
Bihar Politics: బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మహాకూటమికి గుడ్బై చెప్పి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. బల నిరూపణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాతి రోజునే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి.. స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నితీశ్ దెబ్బకు కుదేలైన ఆర్జేడీకి.. ఈడీ రూపంలో చిక్కులు వెంటాడుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ కుభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ను సోమవారం ఈడీ విచారించింది.
ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాకూటమితో బిహార్లో ప్రభుత్వం నడిపించిన జేడీయూ చీఫ్ నితీశ్.. అనూహ్యంగా ఎన్డీయేలో చేరిపోయారు. అనుకున్న వెంటనే రాజీనామా చేయడం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే బిహార్లోని ఎన్డీయే సర్కారు బల నిరూపణకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సోమవారం 8 మంది మంత్రులతో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు నితీశ్కుమార్.
డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో పాటు మిగతా మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 5 నుంచి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించింది నితీశ్ కేబినెట్.
స్పీకర్ రాజీనామా చేయకపోతే..
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్.. అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. తీర్మానంపై నందకిశోర్తో పాటు బిహార్ మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ, మాజీ డిప్యూటీ సీఎం తారాకిశోర్ ప్రసాద్, జేడీయూ ఎమ్మెల్యే వినయ్ కుమార్ చౌదరి సంతకాలు చేశారు. ఒకవేళ స్పీకర్ అవధ్ బిహారీ రాజీనామా చేయని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్ ద్వారా తొలగింపు ప్రక్రియ నిర్వహిస్తారు.
Also Read: 9వ సారి సీఎంగా నితీశ్ కుమార్.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
ఆర్జేడీకి దెబ్బ మీద దెబ్బ
అధికారం కోల్పోవడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో పడ్డ ఆర్జేడీకి.. ఈడీ విచారణ మరింత ఇబ్బందికరంగా మారింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఈనెల 19న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం లాలూ.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లాలూ కుమార్తె మిసా భారతి కూడా లాలూతోపాటు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే బిహార్లో అధికారం కోల్పోవడం.. మరోవైపు లాలూ కుటుంబం మొత్తం ఈడీ విచారణ ఎదుర్కొంటుండం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.