OFB Corporatisation కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆయుధ కర్మాగార బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం OFB ఆధ్వర్యంలో ఉన్న 41 ఫ్యాక్టరీలను.. ప్రభుత్వ ఆధీనంలోని 7 కార్పొరేట్ కంపెనీలుగా విభజించే దీర్ఘకాల ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ ఉత్పత్తిలో భారత్ ను స్వయం సమృద్ధిగా ఉంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఓఎఫ్బీలో ఉన్న దాదాపు 70,000 మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. జవాబుదారీతనం, సమర్థత, పోటీతత్వాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
కార్పొరేటీకరణ నిర్ణయంతో ఓఎఫ్ బీ స్వయంప్రతిపత్తి మరింత మెరుగుపడి, ఆయుధాల సరఫరాలో జవాబుదారీతనం, సామర్థ్యం పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఉత్పత్తి యూనిట్లకు చెందిన OFB (గ్రూప్ A,B,C) ఉద్యోగులందరినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తూ వారి సర్వీస్ కండీషన్స్ మార్చకుండా డీమ్డ్ డిప్యుటేషన్పై కార్పొరేట్ సంస్థలకు ప్రారంభంలో రెండేళ్ల కాలానికి బదిలీ చేయబడతారని ఆ అధికారి తెలిపారు. పదవీ విరమణ చేసినవారు మరియు ఉన్న ఉద్యోగుల పెన్షన్ బాధ్యతలు ప్రభుత్వం భరిస్తూనే ఉంటుందని తెలిపారు.