jamili Elections Bill: లోక్సభలో ‘జమిలి ఎన్నికల’ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. ఎంతమంది మద్దతు అవసరమంటే?
కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక పేరుతో తేనున్న
- Harishth Thanniru
- Published On : December 17, 2024 / 12:29 PM IST
Jamili Elections bill
jamili Elections Bill: కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం – ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. అయితే, బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. అయితే, జమిలి బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు లోక్ సభ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. లోక్ సభలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం చేసింది.
Also Read: Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు షాక్లమీద షాక్లు.. ప్రధాని పదవికి రాజీనామా?
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు.
శివసేన యూటీబీ సైతం జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించింది. ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ పార్టీ కూడా జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకించింది. ఈ పార్టీ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగంపై దాడి అని పేర్కొన్నారు.
