PM Modi Threat Call : జైలుకెళ్లేందుకు ప్రధాని మోడీని చంపేస్తానని ఫోన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్​ కంట్రోల్​ రూమ్ ​కు ఫోన్​ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

PM Modi Threat Call ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్​ కంట్రోల్​ రూమ్ ​కు ఫోన్​ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఖజూరీ ఖాస్​ ప్రాంతానికి చెందిన సల్మాన్(22)​అలియాస్​ అర్మాన్​గా గుర్తించారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్.. మళ్లీ జైలుకు వెళ్లాలనే కోరికతో ఈ ఫోన్​ కాల్​ చేసినట్లు తమతో చెప్పాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

2018లో ఓ హత్య కేసులో సల్మాన జువైనల్​ కరెక్షన్​ హోమ్​లో ఉండి.. ఆ తర్వాత విడుదలయ్యాడని వెల్లడించారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన అతను మళ్లీ జైలుకు వెళ్లాలని భావించాడు. అయితే జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని మోడీని చంపేస్తా అంటూ గురువారం అర్ధరాత్రి సమయంలో సల్మాన్​ ఈ ఫోన్​ చేశాడని పోలీసులు తెలిపారు. ఫోన్​ కాల్​ రాగానే వెంటనే అప్రమత్తమై.. ట్రేస్​ చేశామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం ఖజూరీ ఖాస్​ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా జిల్లా పోలీసు విభాగానికి సమాచారమిచ్చామని చెప్పారు.

ప్రాథమిక దర్యాప్తులో.. ఫోన్​ కాల్​ చేసే సమయంలో సల్మాన్​ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని తెలిపారు. తాను డ్రగ్స్​ తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. అంతకుముందు 10 గంటల ప్రాంతంలో తన తండ్రి అతడిని తిట్టాడని చెప్పారు. జైలుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావ్​ అని ప్రశ్నించగా.. తనకు అక్కడ ఉండాలనిపిస్తోందని దర్యాప్తు సమయంలో సల్మాన్​ చెప్పాడని సదరు సీనియర్​ అధికారి వెల్లడించారు. ఇంటిలెజెన్స్​ బ్యూరోతో కలిసి ఢిల్లీ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు